ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఖరారైంది. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్లి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటి అవ్వనున్నారు. దీంతో ఈ భేటిపై ఇటు ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్డీఏకు మిత్ర పక్షాలు దూరమవుతున్న తరుణంలో జగన్ హస్తిన టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ సీఎం జగన్ వెంటవెంటనే ఢిల్లీ పర్యటనలు కీలకం కానున్నాయి. జగన్ ప్రధానితో భేటిపై స్పష్టత వచ్చింది. ప్రధాని జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు ఆయన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావవాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి క్లియర్గా మాట్లాడనున్నారు జగన్. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మూడు రాజధానుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇక అమరావతి భూ కుంభకోణం, హైకోర్టు విషయంలో కొనసాగుతున్న కేసుల విచారణ అన్నింటినీ ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళతారని తెలుస్తోంది. ఇప్పటికే మోదీని కాదని మిత్ర పక్షాలు తమ దారి చూసుకున్నాయి. అయితే ఇక బలమైన పార్టీగా వైసీపీని తమతో కలుపుకోవాలని మోదీ భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ భేటిలోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయా అన్న ఉత్కంఠత నెలకొంది. అయితే ఇప్పటికీ జగన్ మాత్రం బీజేపీకి సపోర్టు బయటి నుంచి మాత్రమే ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే అన్నిటింలో సహకారం అందిస్తున్న జగన్ను బీజేపీ కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తున్నట్లు టాక్. మరి మరో రెండు రోజులు ఆగితేనే దీనిపై క్లారిటీ రానుంది.