తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం వ్యవసాయ బిల్లును అడ్డగోలుగా పాస్ చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కేంద్రం తీరు బాగోలేదు కాబట్టే దసరా పండుగ రోజు రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగలబెట్టారని పేర్కొన్నారు. మనం కూడా పిడికిలి బిగించాలని రైతులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
పెన్షన్ల విషయంలో తాను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. 38 లక్షల 64 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంటే.. కేంద్రం కేవలం 7 లక్షల మందికి రూ.200 మాత్రమే ఇస్తోందని వెల్లడించారు. కానీ దుబ్బాకలో బీజేపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి రైతులు చాలా అవసరం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. రైతుల కోసం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. తన దృష్టి మొత్తం రైతుల మీదే ఉంటుందని కేసీఆర్ అన్నారు.