కరోనా విషయంలో భారత్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా రికవరీ రేటు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. అయితే ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీకి కరోనా నుంచి భారీ ఉపశమనం లభించింది. గడిచిన నాలుగు నెలల కన్నా శనివారం అత్యల్ప కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం కరోనా వ్యాప్తి రేటు 1.3 శాతంగా ఉంది. అలాగే యాక్టివ్ కేసుల రేటు 1.68 శాతంగా ఉంది. రికవరీ రేటు విషయానికొస్తే అది అత్యధికంగా 96.65 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,358గా ఉంది.
ఆగస్టు తరువాత ఇదే అత్యల్ప కేసుల సంఖ్య. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో మొత్తం 1,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,15,914గా ఉంది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 32 మంది మృతి చెందారు. ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 19,251కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి మొత్తం 2,168 మంది కోలుకున్నారు. మొత్తంగా ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 5,95,305కు చేరింది.
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ విషయంలో చర్యలు మొదలయ్యాయి. త్వరలోనే దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రణాళికలు రచిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోనికి రాగానే ప్రజలకు ఇవ్వనున్నారు. ఇలంటి పరిస్థితుల్లో కేసులు కూడా తక్కువ కావడం సంతోషించే విషయమే.