కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీతో దేశ వ్యాప్తంగా బీజేపీ విమర్శలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు బీజేపీపై మండిపడుతున్నాయి. అయితే అమెరికా ఎన్నికల్లో కూడా అచ్చం బీజేపీలాగే ఎన్నికల్లో గెలిస్తే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు.
అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 2,27,107 మంది కరోనాతో చనిపోయారు. 85,78,831 మంది కరోనా బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో అద్యక్ష్య ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ మాట్లాడుతూ కరోనాపై పోరులో ట్రంప్ చేతులెత్తేశారని ఆరోపించారు. తాను అధికారం చేపట్టగానే కరోనాపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందజేస్తానని చెప్పారు.
అమెరికాను గడగడలాడిస్తున్న కరోనాను అంతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని తయారు చేస్తానని చెప్పారు. ఇక ప్రజలంతా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు. ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొత్తం కరోనా వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతూ ఉంది. తామొస్తే అమెరికా ప్రజలను ఆదుకుంటామని ఇరు పార్టీల నేతలు ప్రజలకు హామీలు ఇస్తూనే ఉన్నారు. కాగా ట్రంప్ భారత్పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా మరణాలతో పాటు కాలుష్యంపై కూడా భారత్పై ఆయన మండిపడ్డారు.