తండ్రి కమలహాసన్ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ అక్షర హాసన్. ఓవైపు తండ్రి కమల్, సోదరి శృతిహాసన్ ఇండస్ట్రీలో ఉన్నా.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటూ ముందుకెళుతోందీ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపికలో వైవిధ్యతను కనబరుస్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటిస్తోంది. 2017 లో వచ్చిన షమితాబ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన అక్షర.. అనంతరం అజిత్ హీరోగా నటించిన వివేగం, విక్రమ్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ కేకే సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా తండ్రి బాటలో నడవడానికి సిద్ధమవుతోందీ బ్యూటీ. భవిష్యత్తులో తండ్రిలాగే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర మాట్లాడుతూ.. ‘ నాకు దర్శకత్వం చేయాలన్న కోరిక చాలా బలంగా ఉంది. కాని దానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం నా దృష్టంతా నటన పైనే ఉంది. సరైన సమయం చూసుకొని కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అక్షర హాసన్ ఇలా తండ్రి బాటలో నడవడానికి ఇప్పటి నుంచే ప్రయాణం మొదలు పెట్టింది.