కరోనా పరీక్షలు చేసేందుకు డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఉచితంగా చేసిన కరోనా పరీక్షలు ఇక నుంచి డబ్బులు తీసుకొని చేయాలని మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి మేఘాలయలో ప్రజలు కరోనా పరీక్షలు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.
కరోనా టెస్టింగ్ కిట్లపై ఇచ్చిన సబ్సీడీని ఐసీఎంఆర్ ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్.టి. పి.సి.ఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఇలా ఏది చేయించుకోవాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. దీంతో పాటు ప్రభుత్వ కరోనా కేర్ సెంటర్లలో కోవిడ్ రోగులకు అందించే భోజనాలపై కూడా చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద ప్రజలకు తీవ్ర భారం పడనుంది.
కాగా దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, హైరిస్క్ కాంటాక్ట్స్, జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించిన లబ్దిదారులకు మాత్రం దీన్ని నుంచి మినహాయింపు ఇచ్చారు. దారద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు కరోనా పరీక్షలు చేయించుకున్న వారు 72 గంటల్లోపు సరైన సర్టిఫికెట్లు చూపిస్తే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఇక మేఘాలకు వచ్చే పర్యాటకులకు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయనున్నారు. ర్యాపిడ్ టెస్టులకు రూ. 500, ఇతర కరోనా టెస్టులకు రూ. 3200గా ధర నిర్ణయించారు.
అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి పరీక్షలు చేయించుకోవాలనడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. కరోనా టీకా ఇంకా రాని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాలి కానీ నిబంధనలు పెట్టి పరీక్షలు చేస్తామంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.