అంతరిక్షంలో ప్రమాదం తప్పింది. భారత్, రష్యాకు చెందిన ఉప గ్రహాలు అత్యంత దగ్గరగా వచ్చాయి. అయితే వెంటనే ఇరు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
భారత్, రష్యా అంతరిక్ష సంస్థలు వేగంగా స్పందించడంతో అంతరిక్షంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు.. భారత్, రష్యాకు చెందిన ఉపగ్రహాలు ప్రమాదరకమైన రీతిలో పరస్పరం అత్యంత సమీపానికి వచ్చినట్టు తెలిసింది. భూమికి దగ్గరగా ఉండే కక్ష్య నియర్ ఎర్త్ ఆర్బిట్లో ఈ ఘటన జరిగింది. భారత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కార్టోశాట్-2ఎఫ్, రష్యాకు చెందిన ఉపగ్రహం కాపోపాస్-వీకి దాదాపు 224 మీటర్ల సమీపంలోకి వచ్చిందని రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మొనాస్ ప్రకటించింది.
కాగా.. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చీఫ్ శివన్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. కానీ..శాటిలైట్ల మధ్య దూరం 420 మీటర్లుగా ఉందని ఆయన తెలిపారు. ‘మేము శాటిలైట్ గమనాన్ని గత నాలుగు రోజులుగా పరిశీలిస్తున్నాం. వాటి మధ్య దూరం 420 మీటర్లుగా ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే.. రెండు దేశాల అంతరిక్ష సంస్థల సమన్వయంతో ఉపగ్రహాలు ఢికొనే ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. అంతరిక్షంలో వేల కొద్దీ ఉపగ్రహాలు చక్కర్లు కొడుతున్నాయని, ఇటువంటి ఘటనలు అంత అరుదైనవేమీ కావని శివన్ స్పష్టం చేశారు. ఇటువంటి సందర్భాల్లో ఆయా దేశాల అంతరిక్ష సంస్థలు చర్చించుకుని శాటిలైట్ల దిశను మారుస్తాయని చెప్పారు. ఇటీవల స్పెయిన్ విషయంలోనూ ఇటువంటి పరిస్థితి ఎదురైనట్టు ఆయన తెలిపారు.