రాయలసీమ లో నిర్మించాలనుకున్న ఎత్తిపోతల పథకంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుండి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపట్టనుంది. దీంతో తెలంగాణ సర్కారు ఈ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండర్ల ప్రక్రియ చేపట్టకుండా చూడాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు వస్తాయని తెలంగాణ చెబుతోంది. ఈ మేరకు గతంలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.
అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గతంలోనే ఏపీ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియకు వెళుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో చూడాలి.