ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో సంచలనం జరుగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. రోజుకో నేత పార్టీని వీడుతున్నారు. తాజాగా పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్లు గల్లా అరుణ కుమారి చెప్పారు. ఆమె చంద్రబాబుకు లేఖ రాసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
మొన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపిని వీడారు. ఇప్పుడు పొలిట్ బ్యూరో సబ్యురాలు గల్లా అరుణ కుమారి బాద్యతలు వద్దని చెప్పడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పార్టీకి రోజుకో దెబ్బ తగులుతోంది. గల్లా అరుణ కుమారి నిర్ణయంతో ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో కూడా పలు అనుమానలు బయటకు వస్తున్నాయి. ఈయన పై కూడా గతంలో పలు వార్తలు వచ్చాయి. పార్టీని వీడతారా అన్న పుకార్లు వినిపించాయి. అయితే ఇది జరగేలేదు.
ఇటీవల ఆయన బీజేపీ నేతలతో కూడా మంచి సంబందాలు కొనసాగిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అమరావతి ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కాస్త సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా అరుణ కుమారి పొలిట్ బ్యూరో నుంచి వైదొలగడంతో అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం అమర్ రాజా బ్యాటరీ కంపెనీలకు సంబంధించిన భూముల విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా తాత్కాలికంగా ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుకట్ట వేసినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేలా లేదు. దీంతో రాజకీయ, ఆర్థిక అన్ని కోణాల్లో గల్లా కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలన్నింటినీ చూస్తే గల్లా కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంటుందా అని అనిపిస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న గల్లా లాంటి వాళ్లు దూరమైతే టిడిపికి గట్టి ఎదురు దెబ్బే. మరి గల్లా అరుణ కుమారి తీసుకున్న ఈ నిర్ణయం వెనుకున్న కారణమేంటో తెలియాలి. లేదంటే టిడిపిలో గందరగోళం నెలకొన్నట్లే…