బీజేపీ, శివసేన మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంది. బీజేపీపై శివసేన మాటల యుద్దం చేస్తోంది. 2020 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ శివసేన ఫైర్ అయ్యింది. లద్ధాఖ్ సరిహద్దులోకి చైనా సైనికులలు చొచ్చుకు రావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొందని ఆ సమయంలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినాదాలు చెలరేగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సరిహద్దులో మోహరించిన చైనా సైనికుల్ని వెనక్కి పంపించకుండా చైనా పెట్టుబడుల్ని దేశం నుంచి తరలిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై శివసేన అధికారిక పత్రిక సామ్నాలో మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బు ఉండదు. కానీ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రం చాలా డబ్బు ఉంటుందని మోదీని ఉద్దేశించి శివసేన వ్యాఖ్యలు చేసింది. దేశం చాలా అప్పుల్లోకి వెళ్తోంది. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లయితే దానికి తప్పనిసరిగా ప్రశంసలు కురిపించాలని అనింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో మోదీ కీలకపాత్ర వహించారట. బీజేపీ ఎంపీ కైలాష్ విజయవర్గీయ దీనిని చాలా గొప్పగా చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే పనిలో మోదీ బిజీగా ఉన్నట్లయితే మనం అంతకు మించి ఇంకేం మాట్లాడగలం అంటూ సామ్నా పత్రికలో రాసింది.
కరోనా లాక్డౌన్ కారణంగా ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మన దేశ ప్రజల బ్యాంకు ఖాతాల్లో 85 వేల కోట్ల రూపాయలు వేస్తామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారని పేర్కొంది. బ్రెజిల్, బ్రిటన్ కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. అయితే భారతీయుల జేబులు ఖాళీగానే ఉన్నాయంది. దేశం ఆర్థిక కష్టాల్లో ఉంటే వేల కోట్లతో కొత్తగా పార్లమెంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ప్రజల నుంచి లక్ష చందా కూడా వసూలు చేయలేరు. ఎందుకంటే ఇది వ్యర్థమైన పనని ప్రజలకు తెలుసు’’ అని సామ్నా విమర్శించింది.