బీహార్ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా ముగిశాయి. ఆర్.జే.డి నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. ఎందుకంటే సర్వేలు ఆ విధంగా వచ్చాయి. అయితే అవన్ని తలక్రిందులు చేస్తూ బీహార్ను ఎన్డీయే కైవసం చేసుకుంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా చాటింది. దీంతో సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితి దాదాపుగా లేదు.
అయితే ఈ సారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ క్రికెటర్ భార్య బీజేపీ బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ భార్య సంగీతా చౌహాన్ నవేగాన్ సాదత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 61 ఏళ్ల సంగీత 20వేల ఓట్లతో విజయం సాధించారు. సంగీత గతంలో బ్యాంకరుగా, హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 29 ఏళ్ల పాటు బ్యాంకరుగా సేవలందించిన సంగీత తన భర్త తోకలిసి బీజేపీ కోసం పనిచేశారు.
తన భర్త మరణించినా తనతోనే ఉన్నాడని, తనకు మద్ధతు ఇచ్చి గెలిపించిన నవేగాన్ సాదత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను అభివృద్ధి కోసం పనిచేస్తానని సంగీత హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ అయిన చేతన్ చౌహాన్ కరోనాతో మరణించారు. అర్జున అవార్డు గ్రహీత అయిన చేతన్ టెస్టు మ్యాచ్ లలో పాల్గొన్నారు. బీహార్ భారీ విజయంతో పాటు దేశంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది.