అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాకుండా యావత్ భారతీయ సినిమాను తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ సెన్సేషన్. ఇక ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు. ఇదిలా ఉంటే తాజాగా సందీప్ రెడ్డి తన తర్వాతి చిత్రాన్ని నేరుగా హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఆన్లైన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో సందీప్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై సందీప్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి నుంచి నేను తీయబోయే సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంటాను. నేను చేసే సినిమా కోసం ఇతర నిర్మాతలు డబ్బు పెట్టినప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ దొరకడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక అర్జున్ రెడ్డి చిత్రాన్ని కూడా సందీప్ తన సోదరుడితో కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే భవిష్యత్తులో సందీప్ తన చిత్రాలకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నాడన్నమాట.