రచయితగా కెరీర్ మొదలు పెట్టిన కొరటాల శివ.. ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమా ‘మిర్చి’తోనే కొరటాల అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అనంతరం శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు కొరటాల స్టార్ హీరోలకు ఒక ఫేవరేట్ ఆప్షన్. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూనే కమర్షియల్గా తెరకెక్కించడం ఒక్క కొరటాలకే దక్కింది. ఇక ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు తాజాగా చిరంజీవితో ఆచార్య అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడా.? లేదా కథను మాత్రమే అందిస్తాడా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కేవలం బడా హీరోలతో పనిచేసిన కొరటాల ఆ సక్సెస్ క్రెడిట్ అంతా హీరోలదే అనే వాదనను ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగానే తాను ఏ హీరోతోనైనా సినిమా తీసి సక్సెస్ కొట్టగలనని నిరూపించడానికే కొరటాల ఈ సినిమా చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి ఏదేమైనా అందరూ స్టార్ హీరోలతోనే పనిచేసిన కొరటాల ఇలా తన మనసు మార్చుకోవడానికి కారణమేంటో ఆయనే చెప్పాలి. ఇక నవీన్ పొలిశెట్టితో సినిమా పూర్తికాగానే కొరటాల బన్నీతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.