మధ్య ప్రదేశ్ శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గ్వాలియర్లోని డాబ్రా పట్టణంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇమారతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అని పేర్కొన్నారు.
ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ‘ఐటమ్’లా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి సింపుల్ పర్సన్ అని వ్యాఖ్యానించారు. ఇమారతీ దేవి, మరొక 21 మంది ఎమ్మెల్యేలు కలిసి జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరంతా పార్టీ మారడంతో కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ మాటలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు దీనిపై మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు.
కమల్నాథ్ తన పార్టీ నేత అని, అయితే వ్యక్తిగతంగా తాను ఆయన ఉపయోగించిన భాషను ఇష్టపడనని చెప్పారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు. మధ్యప్రదేశ్లో 28 శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 3న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 10న జరుగుతుంది. ఈ వ్యాఖ్యలను రాహుల్ ఖండించడంతో అందరూ ఆయన్ను ప్రశంశిస్తున్నారు. సొంత పార్టీ నేత అయనా క్రమశిక్షణ విషయంలో నిజాయితీ వ్యవహరించడం మంచిదంటున్నారు. ఇక నేతలు వెనకా ముందు చూసుకొని వ్యాఖ్యలు చేయాలని సూచిస్తున్నారు.