ఆంధ్రప్రదేశ్లో బీసీలకు పదవులు కేటాయించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఇటీవల వై.ఎస్ జగన్ బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తద్వారా బీసీలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని వైసీపీ నేతలు చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు సంస్థాగత పదవులు ప్రకటించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవమని.. బీసీలకు తాము వెన్నంటే ఉంటామని టిడిపి చెబుతోంది.
దీంతో రాజకీయాల్లో రెండు మూడు రోజులుగా బీసీల నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. తామంటే తాము అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు బీసీల జపం చేస్తున్నారనుకోవచ్చు. ఈ రోజు ఉదయం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్ గా టిడిపి నేతలు అటాక్ చేస్తున్నారు. టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే.. జగన్ రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి.. ఐదుగురు రెడ్లకు కట్టబెట్టారు. 850 ముఖ్య పదవుల్లో జగన్రెడ్డి రెడ్లను కూర్చోబెట్టారు. చట్టం ఒప్పుకోదు కాబట్టి ఊరుకున్నారు కానీ… లేదంటే బీసీ కార్పొరేషన్లకు రెడ్లను పెట్టేసేవారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం.. వెనకబడిన తరగతులను వెన్నుపోటు పొడవడం కాదా.. అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
అంతకుముందు విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. అధిరారంతో విర్రవీగిన రోజుల్లో ‘అంతు చూస్తా, తోక కోస్తా’ అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అని ఆయన ట్వీట్ చేశారు. ఇలా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోందనే చెప్పాలి.