భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలోకి వెళ్లినా సరే చైనా ఆక్రమణలపై వ్యాఖ్యానిస్తూనే ఉంటానన్నారు.
సరిహద్దు వివాదం, కరోనా, ఇతర సమస్యలపై గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల వారు మన దేశంలో ఆక్రమించుకునేందుకు అవకాశాలు ఇచ్చేవారు జాతిద్రోహులన్నారు. సరిహద్దు వివాదంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్న బీజేపీ విమర్శలపై రాహుల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ద్వారా తన సందేశాన్నిఇచ్చారు. నిజాలేంటో ప్రజలకు తెలిజేయాలన్నారు.
లద్దాక్లో చైనా ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటున్న వారు నిజమైన జాతీయవాదులు, దేశభక్తులు కాదని రాహుల్ అన్నారు. చైనా ఆగడాలపై ఆయన మండిపడ్డారు. మన భూభాగంలోకి చైనా వచ్చిందన్నారు. ఇతరులు మన దేశంలోకి ఎలా వస్తారన్నారు రాహుల్. తన రక్తం మరిగిపోతోందన్నారు.