దేశ రాజధాని ఢిల్లీ పేరు చెబితేనే ముందుగా గుర్తొచ్చేది కాలుష్యం. ఇది ఏ రూపంలో వస్తున్నా ప్రజలు మాత్రం ఢిల్లీలోని కాలుష్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కాగా దీపావళి నేపథ్యంలో ఈ కాలుష్యం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్న ఆదేశాలు ఉన్నా పలువురు దీన్ని లెక్క చేయలేదు.
కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)481, ఐజీఐ ఎయిర్ పోర్టు ఏరియాలో 444, ఐటీవోలో 457, లోధి రోడ్డు ఏరియాలో 414 పాయింట్లుగా నమోదయ్యింది. గోవింద్పురి, కాల్కాజీ, గ్రేటర్ కైలాష్ మొదలు కొని ఇండియా గేట్ వరకూ పలు ప్రాంతాల్లో అధికంగా వాయు కాలుష్యం ఏర్పడింది. దీనికితోడు పోలీసుల కన్నుగప్పి కొందరు టపాసులను అక్రమంగా విక్రయించారు. అలాగే గ్రీన్ టపాసులకు బదులు కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను అల్లరి మూకలు వెలిగించారు.
దీంతో వాయుకాలుష్యం మరింతగా పెరిగిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఢిల్లీలో నవంబరు 30 వరకూ టపాసులు విక్రయించడం, కాల్చడంపై నిషేధం విధించినా ఢిల్లీలో విచ్చలవిడిగా టపాసుల మోత మోగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు, ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దీపావళి టపాసుల మోతపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. అసలే కాలుష్యంతో అల్లాడిపోతున్న పబ్లిక్ ఇప్పుడు మరింత ఇబ్బందులు పడుతున్నారు. టపాసులు విక్రయించకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా జరిగిందని అంటున్నారు.