పీఎస్సార్ ఆంజనేయులు.. ఎవరీయన.. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈయనను జగన్ ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా, ఏపీ ఆర్టీసీ బాధ్యతలను అప్పజెప్పారు. వస్తూ వస్తూనే సింగంలా సీనియర్ ఆఫీసర్ పీఎస్సార్ ఆంజనేయులు రెచ్చిపోయారు. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. జేసీ బ్రదర్స్ సహా రోడ్డు రవాణాలో అక్రమ వ్యాపారాలు బంద్ చేయించారట.. కోడెల కుమారుడు నుంచి డబ్బులను రికవరీ చేయించాడట.. ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా అవినీతిని అరికట్టిన ఈయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా మూడు కీలక పోస్టుల్లో ఈయనను కూర్చుండబెట్టి ఆశాఖల ప్రక్షాళనకు నడుం బిగించారు. దీంతో ఇప్పుడు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేశారు..
ఏపీ రవాణాశాఖ కమిషనర్ ఆంజనేయులుకు తాజాగా సీఎం జగన్ మరో రెండు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ డీజీతోపాటు ఏపీపీఎస్సీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే ఏసీబీ పనితీరుపై జగన్ సమీక్ష జరిపారు. ఆ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన ఆగ్రహిస్తూనే మెరుగుపడాలంటూ కొంత సమయం ఇచ్చారు. కానీ ఏకంగా డీజీ స్థాయి అధికారిని మార్చేయడం ఏపీ ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఏసీబీ డీజీగా కుమార విశ్వజిత్ తన అంచనాలకు తగ్గట్లుగా పనిచేయడం లేదని ఆయనను బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కఠిన ఆదేశాలు ఇచ్చారు పనిచేయని అధికారులకు జగన్ నిర్ణయం హెచ్చరికగా మారింది.
ఏపీ రవాణాశాఖను కమిషనర్ గా బాధ్యతలు చేపట్టగానే పీఎస్సార్ ఆంజనేయులు ప్రక్షాళన చేశారు. ఏపీఎస్ ఆర్టీసీని పట్టాలెక్కించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా తన సత్తా చాటారు. అవినీతి లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని కట్టడి చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా డబ్బులు రివకరీ చేయగలిగారు. జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. దీంతో ఆయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా ఆయనకు ఏసీబీ డీజీగా నియమించారు. అవినీతి రహిత పాలన అందించే లక్ష్యంతో గద్దెనెక్కిన జగన్ తన లక్ష్య సాధనకు పీఎస్సార్ ఆంజనేయులు ఉపయోగపడతారనే తీసుకొచ్చారు.
ఇప్పుడు పీఎస్సార్ ఆంజనేయులు రాకతో ఏసీబీ కొదమసింహంలా అవినీతిపరులపై విరుచుకుపడనుంది. అవినీతితో పంకిలమైన శాఖకు సింగంలాంటి పోలీస్ ఆఫీసర్ ను తీసుకొచ్చి జగన్ అందరికీ హెచ్చరికలు పంపారనే చెప్పవచ్చు.