సమాజంలో జరిగే అంశాల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం సర్వ సాధారణమైన విషయమే. అందులోనూ క్రైమ్ ఆధారిత కథలను తెరకెక్కించడానికి.. దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి కథాంశంతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను కూడా సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో రియల్ క్రైమ్ స్టోరీ వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
మహిళలను ప్రేమ పేరుతో మోసగించి.. వారిని శారీరకంగా అనుభవించి గర్భనిరోధక మాత్రలు అంటూ సైనైడ్ ఇచ్చి అత్యంత దారుణంగా చంపేసిన పీఈటీ టీచర్.. మోహన్ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మోహన్ కు ఆరు మరణ శిక్షలు, 14 జీవితఖైదు విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కథ ఆధారంగానే.. రాజేష్ టచ్ రివర్ అనే దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా ప్రియమణి నటించనుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.