దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ఎప్పుడు ఏదో ఒక చోట ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురిని భద్రతా దళాలు పట్టుకుంటున్నాయి. తాజాగా మరో ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దీంతో వారు ఎక్కడ విధ్వంసానికి ప్లాన్ చేశారన్న దానిపై టెన్షన్ నెలకొంది.
దేశరాజధాని నగరమైన ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీరుకు చెందిన ముగ్గురు, పంజాబ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది ఇంకా నిర్ధారించలేదు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉగ్రదాడికి వ్యూహం పన్నిన ఇద్దరు జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను 20 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 10లైవ్ కాట్రిడ్జులను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుతో దేశ రాజధాని నగరంలో ఉగ్రదాడి కుట్రను పోలీసులు విఫలం చేశారు.