ప్రధాని మోడీ నుండి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కి ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. తాజా రాజకీయాలను ఉద్దేశించి సమాచారం తెలుసుకోవడానికి ప్రధాని మోడీ ఉన్నట్టుండి గవర్నర్ నరసింహన్ ని పిలిచారంటున్నారు ఢిల్లీ పెద్దలు. ఇదే క్రమంలో గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న హడావిడి ని బిజెపి పెద్దలు గమనిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో గవరనర్ నరసింహన్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించే అవకాశముందని తెలిసింది. అంతేకాకుండా ఇతర కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ కలుస్తారట.
ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీలో టీడీపీ చేస్తున్న రాజకీయ ఎదురుదాడి గురించి కూడా చర్చకు రానుందని సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు చేసిన కామెంట్లు, రాజకీయంగా బీజేపీని ఇరకాటంలో పెడుతున్న తీరుపై కూడా ప్రధాని మోడీ అడిగి తెలుసుకోనున్నారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీల గురించి చర్చిస్తారని సమాచారం.