ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండడు. ఎందుకంటే ఆయన వేసే ప్రణాళికలతో ఎన్నికలకు వెళితే గెలుపు ఖాయమన్న నిజాలు ఎన్నో సార్లు తెలిసిపోయాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీకి వ్యూహకర్తగా ఉండి ఎలాంటి మెజార్టీ తెప్పించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లలో 151 అసెంబ్లీ సీట్లు వైసీపీకి వచ్చాయి. దీన్ని బట్టి వైఎస్ జగన్ గెలుపు ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అయితే ఆయనకు వెనకుండి రాజకీయ వ్యూహకర్తగా నడిపించి మాత్రం పీకే అదే ప్రశాంత్ కిషోర్ అని తెలుసు. అలాంటి ఇప్పుడు ఈయన మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆయన అధికార పార్టీ తరుపున రాజకీయ వ్యూహకర్తగా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరో పదిహేను నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో పీకేతో అమరీందర్ సింగ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనతో ఒప్పందం కుదుర్చుకొని రాజకీయ వ్యూహ కర్తతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్ నాయకత్వం ప్రయత్నాలు జరుపుతోంది.
ఇప్పటికే మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, పథకాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి అమరీందర్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలను గెలిపించడానికి పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఒప్పందం కుదరగానే ఆయన బృందం రంగంలోకి దిగి అన్ని వ్యవహారాలను చూసుకోనుంది. మరి ఈ ఒప్పందం కుదురుతుందో లేదో వేచి చూడాలి.