కరోనా నిబంధనలు కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో మాస్క్ లేకుంటే ఫైన్లు వేస్తున్నారు. తాజాగా మిగతా రాష్ట్రాలలో కూడా కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
దేశరాజధాని ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింత అప్రమత్తమై, కరోనా కట్టడి చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మొదలైనవి ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని ఆదేశించాయి. ఈ నియమాలను ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో మాస్క్ ధరించని వారికి రూ. 5 వేలు జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు.
ఢిల్లీలో మాస్క్ ధరించనివారికి ఇంతవరకూ రూ. 500 జరిమానా విధిస్తుండగా, దానిని ఇప్పుడు రూ. 2 వేలకు పెంచారు. ఉత్తరప్రదేశ్లో కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. ఇక హరియాణా విషయానికొస్తే, ఇక్కడి గురుగ్రామ్లో మాస్క్ ధరించనివారికి రూ. 2,500 జరిమానా విధిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 500 జరిమానా విధిస్తున్నారు. పంజాబ్లో మాస్క్ ధరించనివారికి ఇంతవరకూ రూ 200 జరిమానా విధిస్తుండగా, దానిని రూ. 500కు పెంచారు. రాజస్థాన్లో మాస్క్ ధరించనివారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు. మహారాష్ట్రలోని వివిధ పట్టణాలలో ఒక్కోవిధంగా జరిమానా విధిస్తున్నారు. పూణేలో బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. గుజరాత్లో మాస్క్ ధరించని వారి నుంచి వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు.