20 కోట్లకు ‘కార్తికేయ‌ 2’ రైట్స్ సొంతం చేసుకున్న జీ సంస్థ..

వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్. కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త కథలు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆయన. అలా నిఖిల్ ప్ర‌తిష్టాత్మ‌క థ్రిల్ల‌ర్ కార్తికేయ. ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రంతో తెలుగు తెరకి ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా.. సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా.. అల‌రించేలా త‌న పెన్ కి ప‌ని పెట్టే ద‌ర్శ‌కుడు చందు మెుండేటి మ‌రొక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో వస్తున్న చిత్రం కార్తికేయ‌ 2. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు విడివిడిగా ఎన్నో సూప‌ర్‌ హిట్స్ అందించారు. అలాగే క‌లిసి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించారు.

తాజాగా మరోసారి నిఖిల్‌, చందు మొండేటి క్రేజీ కాంబినేష‌న్‌లో కార్తికేయ‌ 2 సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్ లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా కార్తికేయ 2 సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు సొంతం చేసుకున్నారు జీ సంస్థలు. ఇప్పటివరకు సినిమా నుంచి కేవలం ఒక టీజర్ కూడా విడుదల కాలేదు.. ఎలాంటి విజువల్స్ కూడా బయటికి రాలేదు.. కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. వీటితోనే కార్తికేయ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. వీటితోనే సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరగడం గమనార్హం. Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముగ్ధ అనే పాత్రలో నటిస్తున్నారు అనుపమ పరమేశ్వరన్. ఈమె పాత్ర చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చందూ మొండేటి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here