రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే మావోయిస్టులు లేఖ రాసి హడలెత్తించారు. మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. కరోనా నివారణకు వ్యాక్సిన్లు పరిష్కారం కాదని లేఖలో పేర్కొన్నారు.
మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైతే అంతా భయపడిపోతుంటారు. లేఖలో ఎవరిని టార్గెట్ చేశారోనని ఆందోళన చెందుతారు. అయితే ఈసారి కరోనా విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మావోయిస్టు గణేష్ లేఖ రాశారు. ఇందులో ఏముందుంటే కరోనా నివారణకు వ్యాక్సిన్లు, టీకాలు పరిష్కారం కావని, సోషలిస్టు సమ సమాజ నిర్మాణమే ఏకైక పరిష్కారమని లేఖలో పేర్కొన్నారు.
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు రావడం ఏంటన్నారు.. ఇలాంటి సమయంలో పోలీసులు రాకుండా డాక్టర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగాలన్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కూంబింగ్ పార్టీలకు కరోనా సోకిందన్నారు. గ్రామాల్లోని సంతల్లోకి రాకుండా చూడాలని అవసరమైతే ప్రతిఘటించాలని మావోయిస్టులు తెలిపారు.
కరోనా సమయంలో పెళ్లిళ్లు, పండుగలు చేసుకోవాల్సి వస్తే పరిమితంగా జరుపుకోవాలన్నారు. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లొద్దని.. బయటి వారు మన ప్రాంతాల్లోకి రాకుండా చూడాలన్నారు. ఇక ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి వర్తింపజేస్తూ రోజుకు రూ.500 నేరుగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలు తీసుకున్న అన్ని రకాల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలివ్వాలన్నారు.