దేశ వ్యాప్తంగా బాణసంచాపై ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో టపాసులు పేల్చడం ఎంతో ప్రమాదకరం. అయినప్పటికీ మొన్న గడిచిన దీపావళి సందర్బంగా దేశ వ్యాప్తంగా టపాసులు కాల్చారు.
దీంతో దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్పులపై నిషేధం విధిస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) పేర్కొంది. ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే మరోవైపు బాణాసంచా దానికి ఆజ్యం పోస్తోందని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. కోవిడ్-19 మహమ్మారి పోయేంత వరకు బాణాసంచా కాల్పులపై నిషేధం ఉంటుందని ఎన్జీటీ స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితం జరిగిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. కోవిడ్-19 ప్రభావానికి అతలాకుతలమై కాస్తంత కోలుకున్న ఢిల్లీకి ఇది పునర్విపత్తుగా పరిణమించింది. కాలుష్యం పెరిగిపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగి కోవిడ్ కేసులు మళ్లీ విజృంభించాయి. బాణాసంచా కాల్పులపై సుప్రీం కోర్టు రెండు గంటల సమయమే ఇచ్చినప్పటికీ కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగింది.
ప్రస్తుతం ఎన్జీటీ ఇచ్చిన ఆదేశా ప్రకారం.. నేషనల్ క్యాపిటల్ రీజియన్తో పాటు దేశంలో కరోనా ప్రభావం ఉన్న అన్ని నగరాలు, పట్టణాలతో పాటు కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్పులపై కోవిడ్ ప్రభావం తగ్గే వరకు నిషేధం విధించారు.