బాలీవుడ్ హీరో సుశాంత్ బలవన్మరణం కేసులో అతని ప్రేయసి రియా చక్రవర్తి ని సీబీఐ, మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ, నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో ఎన్సీబీ విచారిస్తున్నాయి. అయితే తనతో పాటు తన కుటుంబం విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నామని కానీ సుశాంత్ అభిమానులు మా పని మమ్మల్ని చేసుకోనివ్వటం లేదని ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రియా ఇంటి ముందు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.
“మేము ఇల్లు దాటి బయటకు వచ్చి ఈడీ, సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ నాతో పాటు, నా కుటుంబ సభ్యుల జీవితం ప్రమాదంలో ఉంది. మాకు రక్షణ కల్పించాలని పోలీసులను, దర్యాప్తు అధికారులను కోరాము. ఎవరూ మాకు సాయం చేయలేదు. మేము ఎలా ముందుకువెళ్లాలి? కేవలం విచారణకు వెళ్లేందుకు మాకు రక్షణ కల్పించాలని అడుగుతున్నాం. ఈ విషయంలో మాకు ఎలాగైనా సాయం చేయాలని ముంబై పోలీసులను అభ్యర్థిస్తున్నా” అని రియా రాసుకొచ్చారు.