దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న ప్రజలు.. వరదలతో బిక్కుబిక్కుమంటున్నారు.
అరేబియా సముద్రంలో వచ్చిన ద్రోణి కారణంగా ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ముంబైలోని పలు ప్రాంతాలన్నీ నీటిలో ఉండిపోయాయి. ప్రధాన కూడళ్లలో నదుల్లా నీరు ప్రవహిస్తోంది. జనం ఆ నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల దాదాపు 12 గంటల నుంచి ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు ఎక్కడుందో డ్రైనేజీ ఎక్కడుందో తెలియడం లేదు.
ముంబైతో పాటు థానే, రాయ్ఘడ్ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఎడతెరపి లేని వర్షాలతో తాపి, తద్రి నదులతో పాటు గోదావరి, దమనగంగ నదులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. సముద్రప్రాంతం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటను మానేశారు.