హిందూదేవాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ సారి ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన… స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ సతీమణితో కలిసి రామాలయానికి వెళ్లి పూజలు చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయన్నారు. జగన్కు సలహా ఇచ్చే స్థాయి బీజేపీకి లేదన్నారు. ఎవరి పార్టీ విధానాలు వాళ్లకు ఉంటాయన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం మాత్రం ఆలయాలకు ఒంటరిగా వెళ్తారా.. జగన్ మాత్రం కుటుంబ సమేతంగా రావాలా అన్నారు.
బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. వేంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. శ్రీవారి దయవల్లే జగన్ సీఎం అయ్యారన్నారు. సీఎం జగన్కు కులాలు, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా… చర్చిలో క్రైస్తవుడిలా… మసీదులో సమయంలో నవాబులా ఉంటారని తెలిపారు. కాగా ఇటీవల హిందూ దేవాలయ విషయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.