కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరిన ఓ పిల్లోడి కడుపులో ఇనుప కడ్డీలు ప్రత్యక్ష్యమయ్యాయి. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లు సైతం షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలోని భట్వా గ్రామానికి చెందిన కరణ్ వయస్సు 18 సంవత్సరాలు. ఇతనికి కడుపు నొప్పి రావడంతో శుక్లాగంజ్లోని ప్రైవేటు నర్సింగ్ హోంకు తరలించారు. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీయడంతో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. మామూలు కడుపు నొప్పితో అడ్మిట్ అయిన అతని కడుపులో ఇనుప కడ్డీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే మూడు గంటల పాటు కష్టపడి మారథాన్ సర్జీరీ చేశారు. దీంతో కడుపులో ఉన్న ఇనుప కడ్డీలు బయటకు తీశారు.
కరణ్ కడుపులో మొత్తం 36 ఇనుప కడ్డీలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. వీటన్నింటినీ బయటకు తీసినట్లు తెలిపారు. ఈ కడ్డీలు మొత్తం 300 గ్రాముల బరువు ఉన్నట్లు వెల్లడించారు. అయితే కరణ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. స్థానికంగా పలుమార్లు వైద్యులకు చూపించినా కడుపు నొప్పి మాత్రం తగ్గలేదని చెప్పారు. అయితే కరణ్ తండ్రి కమలేష్ మాట్లాడుతూ పిల్లోడు కొంచెం మతిస్థిమితం లేకుండా ఉన్నట్లు వైద్యులకు తెలిపారు. అయితే ఈ ఇనుప కడ్డీలు ఎలా కడుపులోకి వెళ్లాయన్న దానిపై ఎవ్వరికీ తెలియదని చెబుతున్నారు. ఇదేమీ చిన్న వస్తువు కూడా కాదు.
కడుపులో నుంచి బయటకు తీసిన ఇనుప కడ్డీలు 3 ఇంచులు ఉన్నాయి. వీటిని ఎలా తిని ఉంటాడన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విషయం తెలిసిన వారంతా షాక్కు గురవుతున్నారు. ఇప్పుడు కరణ్ ఇనుప కడ్డీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కరణ్ కడుపులో ఇనుప కడ్డీలు తీయడం అంత ఈజీగా జరగలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు నలుగురు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని తెలుస్తోంది.