సెంట్రల్ జైళ్లలో కరోనా విజృంభిస్తోంది. మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన విషయం తెలిసిందే. నేడు కడపలో కరోనా కేసులు భారీగా బయటపడ్డాయి.
మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈయన కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈయనతో పాటు చాలా మంది ఖైదీలకు కరోనా సోకింది.
మూడు నెలల కింద కడప సెంట్రల్ జైలుకు ఓ రిమాండ్ ఖైదీని తీసుకొచ్చారు. అతనికి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత జైల్లోని ఇద్దరు సిబ్బందికి, 19 మంది ఖైదీలకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో జైలు అధికారులు అలెర్టయ్యారు. సెంట్రల్ జైల్లోని ఖైదీలందరికీ కరోనా పరీక్షలు చేయించారు.
700 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 303 మంది ఖైదీలతో పాటు 14 మంది సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై అందరికీ చికిత్స అందిస్తున్నారు. ఖైదీలను ప్రత్యేక గదుల్లో పెట్టి కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో 250 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.