భారత సైన్యం చరిత్రలో ఓ చారిత్రక ఘట్టం ఆవిషృతమైంది. మొట్టమొదటి సారి సైన్యంలో మహిళా సైనికులు డ్యూటీ చేశారు.
జమ్ముకశ్మీర్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి రైఫిల్ విమెన్ దేశ భద్రత విధుల్లో చేరారు. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో సాధనా పాస్ ద్వారా ఎల్ఓసీ వైపు వెళ్లే రహదారిపై మహిళా అధికారి నేతృత్వంలో ఆరుగురు రైఫిల్ విమెన్ను నియమించారు.
వీరంతా అస్సాం రైఫిల్స్కు చెందిన వారు. డిప్యూటేషన్పై భారత సైన్యంలో చేరినట్లు సైన్యాధికారులు వివరాలు వెల్లడించారు. వీరికి ఎల్ఓసీ దగ్గరున్న జాతీయ రహదారుల్లో పహారా విధులు అప్పగించారు. ఈ ప్రాంతంలో 40 గ్రామాల ప్రజలు కశ్మీర్ వెళ్లేందుకు సాధనా పాస్ మీదుగా వెళ్తుంటారు. దీంతో మహిళలు ఉన్న వాహనాలను తనిఖీ చేసేందుకు రైఫిల్ విమెన్ సేవలు ఉపయోగపడతాయి.
భారత సైన్యంలో మహిళలు శాశ్వత హోదాలో పనిచేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా సాధనా పాస్ ద్వారా నార్కొటిక్స్, నకిలీ కరెన్సీ, ఆయుధాల స్మగ్లింగ్ను రైఫిల్ విమెన్ అడ్డుకుంటారు. ఇప్పుడు వీరున్న ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్కు అత్యంత దగ్గరగా ఉండటంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. మొత్తం మీద మహిళలు భారత సైన్యంలో చేరడం సంతోషించదగ్గ విషయమే.