ఉగ్రవాదులు భారత్లో పెను విధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత్ మాత్రం గట్టిగా సమాధానం చెబుతూనే ఉంది. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. కాగా కశ్మీర్లో భారత్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉగ్రవాద కట్టడి వ్యూహాం సత్ఫలితాలను ఇస్తోంది.
పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్లో నెం.2గా గుర్తింపు పొందిన ముఫ్తీ రవూఫ్ అస్ఘర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఇటీవల కశ్మీర్లో నగ్రోతా ప్రాంతంలోకి ప్రవేశించిన నలుగురు జేష్ ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. భారత్లో భీకర దాడులకు ప్రయత్నించేందుకు ఈ నలుగురు సిద్ధమయ్యారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కశ్మీర్లోని జైష్ ఉగ్రవాదులతో రవూఫ్ సంభాషించాడు. ఇక్కడి ఉగ్రమూకలకు అవసరమైన ‘వస్తువులు’..అంటే ఆయుధాలను సమకూర్చడం కష్టమవుతోందని వ్యాఖ్యానించాడని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
జేషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్కు ముఫ్తీ రవూఫ్ స్వయానా తమ్ముడు. మసూద్ అజర్ అనారోగ్యం పాలవడంతో ప్రస్తుతం జైష్ పగ్గాలు రవూఫ్ చేతుల్లోకి వెళ్లాయని సమాచారం. ఇటీవల నగ్రోతాలో ఉగ్రవాదులను తీసుకురావడంలో ఇతడి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. కశ్మీర్లో భారీ దాడులకు దిగాలనుకున్న జైష్..పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో భారత భద్రతా దళాలు వారిని మట్టుపెట్టడం.. ఉగ్రవాదులకు పెద్ద దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.