లంచాలు తీసుకోవడం ఇటీవల సర్వసాధారణంగా అయిపోయింది. అయితే ప్రభుత్వాలు మాత్రం లంచాలను పూర్తిగా అరికడతామని చెబుతూనే ఉన్నాయి. అయితే భారత్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన ఓ సర్వే రిపోర్టు ప్రకారం భారత్ లంచాల్లో ఇతర దేశాలను వెనక్కునెట్టేసి ముందు వరుసలో నిలిచింది.
అవినీతిలో భారతదేశం రోజు రోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా లంచాల విషయంలో ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచింది భారత్. భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలను వెనక్కి నెట్టి అగ్ర స్థానం సంపాదించింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసిన సర్వేలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
గడిచిన 12 నెలల్లో దేశంలో అవినీతి పెరిగిందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 47 శాతం మంది అభిప్రాయపడ్డారట. కాగా, 63 శాతం మంది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని తగ్గించడానికి మంచి చర్యలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు. అయితే వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. 39 శాతం లంచాలతో ఆసియాలోనే తొలి స్థానంలో భారత్ నిలిచింది. కాగా, 38 శాతం లంచాలతో కంబోడియా ద్వితియ స్థానంలో ఉంది.
ఇక అతి తక్కువ లంచాలతో జపాన్, మన పొరుగునే ఉన్న అతి చిన్నదేశం మాల్దీవులు మెరుగ్గా ఉన్నాయి. ఈ దేశాల్లో లంచాల శాతం కేవలం రెండు శాతం మాత్రమే. ఇక మన మరో పొరుగు దేశం నేపాల్లో సైతం 12 శాతం మత్రమే లంచాలు ఉన్నాయట. శ్రీలంక, బర్మా, ఇండోనేషియా దేశాలు కూడా భారత్ కంటే తక్కువ శాతం లంచాలతో మెరుగ్గా ఉన్నాయి. జనవరిలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన రిపోర్టు ప్రాకారం.. అవినీతిలో ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది.