దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కొద్ది రోజులు తగ్గిన కేసులు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ వ్యాక్సిన్ వైపే ఉంది.
అయితే కరోనా వ్యాక్సిన్ రాగానే అందరికీ పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ ఇది చేరేలా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఏ విధంగా సరఫరా చేయాలన్న దానిపై అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 53,370 కొత్త కేసులు నమోదయ్యాయి. 650 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక వ్యాక్సిన్ పై ఎన్నికల్లో ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాక్సిన్పై ప్రకటించింది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఈ తరహాలో పలు రాష్ట్రాలు కూడా ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ప్రజలు చెబుతున్నాయి. అక్కడ ఎన్నికలు లేనప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు సమాచారం అందజేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందజేస్తామని అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వం ఈ జాబితాలో వచ్చి చేరింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా… తాము మాత్రం రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. కరోనా అనేది మశూచి, పోలియో లాంటిదని, అందుకే ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ఆయన తెలిపారు. మరి ఇంకెన్ని రాష్ట్రాలు ఈ జాబితాలో చేరతాయో చూడాలి. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ రాజకీయ నాయకుల కామెంట్లకు బాగా ఉపయోగపడుతుందని పలువురు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.