అనంతపురం జిల్లాలో ఓ వాలంటీర్పై దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సామాజిక పించన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న వాలంటీర్పై దాడి చేయడం కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకెళితే అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వీరప్ప అనే వాలంటీర్ పించన్లు పంచడానికి బయలుదేరారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దుండగులు అతన్ని వెంబడించి దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లడంతో వాలంటీర్ వీరప్ప ఏం చేయలేకపోయాడు. దీంతో అతని వద్ద ఉన్న 43వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. వై.ఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వా, తాతల దగ్గర నుంచి సామాజకి పించన్లు తీసుకునే ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు పించను సొమ్ము అందజేస్తున్న విషయం తెలిసిందే. పైగా ఒకటో తేదీన అందరికీ పించన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో వాలంటీర్ దగ్గర డబ్బులు ఉంటాయన్న కచ్చితమైన సమాచారంతోనే దుండగులు దాడి చేశారని తెలుస్తోంది. దుండగుల చేతిలో గాయపడిన వాలంటీర్ వీరప్పను వెంటనే చికిత్స నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వీరప్పతో మాట్లాడి కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు దీనిపై ఆరా తీశారు. పించన్లు పంచే డబ్బులు ఎత్తుకళ్లడంతో స్థానికులు మండిపడుతున్నారు.