పిల్లల చదువు కోసం ఎంతవరకైనా వెళతారు తల్లిదండ్రులు. ఆస్తులు అమ్మైనా చదివించాలనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ఆస్తి అమ్మలేదు కానీ తన ఆవును అమ్మేశాడు ఓ తండ్రి.
కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్కు ఇద్దరు పిల్లలు, నాల్గవ తరగతి, రెండవ తరగతి చదువుతున్నారు. అయితే ఇప్పుడు అన్ని విద్యాసంస్థలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుల్దీప్ ను కూడా ఆయన పిల్లలు ఆన్లైన్లో క్లాసులు వినేందుకు సెల్ ఫోన్ కొనివ్వాలని అడిగారు. అయితే తన బిడ్డలకు సెల్ కొనిచ్చేందుకు ఆయన అన్ని విధాలా ప్రయత్నించారు.
పలు చోట్ల ఆయన డబ్బుల కోసం అడిగినా ఎవ్వరూ స్పందించలేదు. దీంతో చేసేదేమీలేక తన దగ్గర ఉన్న ఆవును రూ.6వేలకు అమ్మేశాడు. విషయం బయటకు రావడంతో కుల్దీప్పై అందరూ సానుభూతి చూపిస్తున్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యేకు విషయం తెలియగా వెంటనే స్పందించారు. అధికారులకు చెప్పి కుల్దీప్కు సహాయం చేయాలన్నారు. పిల్లల చదువుకోసం జీవనాధారమైన ఆవునే అమ్ముకున్న ఈయన గురించి తెలిసిన వారంతా ఇప్పుడు ఆవేధన చెందుతున్నారు.