ఏపీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఇటీవల కేంద్ర మంత్రి ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ లేఖకు సమాధానంగా ఏపీ నుంచి తిరిగి లేఖ వెళ్లింది.
ఈ లేఖలో వై.ఎస్ జగన్ ఏమన్నారంటే క్రిష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆదారంగానే ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పాత వాటికి కొనసాగింపు అన్నారు. నీటి మల్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు అదనంగా ఏమీ లేదని జగన్ తెలిపారు.
పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన సమర్థ నీటి వాటా వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల అని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఇక తెలంగాణాపై కూడా జగన్ లేఖలో ప్రస్తావించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో క్రిష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామన్న తెలంగాణ.. తర్వాత మాట మార్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలు చేపట్టిందన్నారు. అయితే ఈ నిర్మాణాలను ఆపాలని అపెక్స్ కౌన్సిల్ తెలంగాణాను ఆదేశించలేదన్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే జరిగింది. ఈ నెల 20న మరోసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ అవ్వడంపై ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేదని కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ అజెండా ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో కోరినా ఇరు రాష్ట్రాలు స్పందించలేదన్నారు.
క్రిష్ణా నదిపై ఏపీ అక్రమ నిర్మాణాలు చేపడుతోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేందుకు నిర్మాణాలు చేపడుతున్నారని ఇది తమ ప్రయోజనాలకు హానికరమని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై గట్టిగా మాట్లాడేందుకు ఏపీ కూడా సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రికి సీఎం లేఖ రాయడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.