ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని సంబరపడుతున్న బీజేపీ నేతలకు షాక్ తగులుతోంది. ఎన్నికలు ఏవైనా బీజేపీ ఈజీగా గెలుస్తుందని ధీమాగా ఉన్న నేతలు ఇప్పుడు ఆలోచనలో పడాల్సి వస్తోంది. తాజాగా ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి కలిసిరావడం లేదు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటునే బీజేపీ గెలుచుకోగలిగింది. మిగితా మూడు స్థానాలూ మహా వికాస్ అగాఢీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇది మరిచిపోక ముందే ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. వారణాసి పరిధిలోని రెండు సీట్లను బీజేపీ కోల్పోయింది. ఈ సీట్లలో సమాజ్వాదీ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అందులో ఒకటి ఉపాధ్యాయుల నియోజకవర్గం కాగా, మరొకటి పట్టభద్రుల నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సమాజ్వాదీ జయకేతనం ఎగురవేసింది.
వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ అభ్యర్థి అశుతోశ్ సిన్హా గెలుపొందగా, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి లాల్బిహారీ యాదవ్ గెలుపొందారు. యూపీలోని మొత్తం 11 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అందులో 5 పట్టభద్రుల నియోజకవర్గాలు కాగా, ఆరు ఉపాధ్యాయుల నియోజకవర్గాలు. మొత్తం 11 స్థానాలకు గాను నాలుగు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మరో రెండు స్థానాలకు ఫలితం ప్రకటించాల్సి ఉంది. అయితే ఏకంగా ప్రధాని నియోజకవర్గంలో తాము గెలుపొందడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సమాజ్వాదీ నేతలు ప్రకటించారు.