చైనా అమెరికా మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చైనాకు ముప్పుతిప్పలు పెట్టారు. మరికొద్ది రోజుల్లో ట్రంప్ అధికారం వెళ్లిపోనుంది. దీంతో ఈ చివరి రోజుల్లో కూడా చైనాను ఇబ్బంది పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
నిబంధనల పాటించని చైనా కంపెనీల సెక్యురిటీలను అమెరికా స్టాక్ మార్కెట్ల నుంచి తొలగించే కొత్త చట్టంపై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. దీంతో..చైనాపై ప్రయోగించేందుకు ట్రంప్ అమెరికా అధికారుల చేతికి మరో అస్త్రం ఇచ్చినట్టైంది. ద ఫోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట తెచ్చిన ఈ కొత్త ఆయుధంతో చైనాకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులోని నిబంధనల ప్రకారం.. ఆర్థిక అంశాలకు సంబంధించి అమెరికా ఆడిట్ నిబంధనలను వరుసగా మూడేళ్ల పాటు ఉల్లంఘించిన విదేశీ కంపెనీల సెక్యురిటీలు అక్కడి స్టాక్ ఎక్సేంజీల నుంచి తొలగించాల్సి వస్తుంది.
రూల్స్లో కేవలం విదేశీ కంపెనీలు అనే పదం మాత్రమే ఉన్నప్పటికీ ఇది చైనా సంస్థలైన అలీబాబా, టెక్ కంపెనీ పిడోడూ, చమురు సంస్థ పెట్రో చైనాలను టార్గెట్ చేసేందుకు ఉద్దేశించినదే భావన బలంగా ఉంది. గతంలో చైనా కట్టడి కోసం ఉద్దేశించిన ఇతర చట్టాల్లాగానే దీనికీ అమెరికా కాంగ్రెస్ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. భారీ మెజారిటీతో బిల్లు పాసైంది. పార్టీలకతీతంగా ట్రంప్ కొత్త చట్టానికి ఓటేశారు. ఈ చట్టంలోని మరో కిలక నిబంధన ప్రకారం.. ఇకపై విదేశీ సంస్థలపై హక్కులు విదేశీ ప్రభుత్వాలకు ఉన్నాయో లేదో కూడా ఆయా సంస్థల యాజమాన్యాలు బహిరంగ పరచాల్సి ఉంటుంది. కాగా..చైనా సహజంగానే ఈ కొత్త చట్టానికి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమపై బెదిరింపులకు దిగొద్దంటూ అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తమ సంస్థలపై విదేశీ రెగ్యులేటరీ సంస్థలు తనిఖీ చేపట్టడాన్ని చైనా ప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. భద్రతా కారణాల రీత్యా తమ దేశానికి చెందిన సంస్థల్లో విదేశీ ప్రభుత్వాల తనిఖీలను నిరాకరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన తాజా చట్టంతో చైనా కంపెనీలకు ఆడిట్ తిప్పలు తప్పవని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.