గణతంత్ర వేడుకలకు కూడా కరోనా ఎఫెక్టు పడింది. 2021లో నిర్వహించే ఈ వేడుకలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పలు ప్రత్యేకమైన రూల్స్ తీసుకొచ్చింది. పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది.
దేశంలో సెకండ్ స్ట్రెయిన్ కరోనా నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి యేడా ఎర్రకోట వద్ద జరిపే త్రివిధ దళాల పెరేడ్ను కేంద్రం రద్దు చేసింది. ఎర్రకోట వద్ద కాకుండా విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై, నేషనల్ స్టేడియం వరకూ జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ త్రివిధ దళాల పెరేడ్ 8.2 కిలోమీటర్ల మేర సాగేది. నూతన స్ట్రెయిన్ కరోనా నేపథ్యంలో 3.3 కిలోమీటర్లకే కుదించారు. వీటితో పాటు పరేడ్లో పాల్గొనే వారు కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉన్నత అధికారులు సూచించారు.
అంతేకాకుండా పరేడ్లో 96 మంది మాత్రమే పాల్గొనేట్లు అధికారులు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల సంఖ్యను కూడా కుదించేశారు. ఇక ప్రతి గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 1,15,000 మంది ప్రజలను అనుమతించేవారు. ఈసారి మాత్రం ఈ సంఖ్యను 25,000 కు కుదించేశారు. 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు గణతంత్ర దినోత్సవాలకు అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు.