ఎక్సయిజ్ ఆదాయన్ని ఎలా పెంచుకోవాలా అని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆ కమిటీ ఇటీవలె ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని తెలుస్తోంది. ఇక ఆ కమిటీలో ఏం ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కమిటీ తన నివేదికలో ఏం చెప్పిందో సమాచారం బయటకు వచ్చింది. మద్యం సేవించేందుకు అర్హత వయసు తగ్గింపు, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో బీర్, వైన్ అమ్మేందుకు అనుమతులివ్వడం, ఢిల్లీవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ స్టోర్స్ను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సలహా ఇచ్చింది. మద్యం సేవించేందుకు చట్టబద్ధ అర్హత వయసును 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని, సంవత్సరానికి మూడు డ్రై డేస్ మాత్రమే ఉండాలని, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో బీర్, వైన్ అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఈ కమిటీ సూచించింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ స్టోర్స్ను ఢిల్లీ వ్యాప్తంగా సమానంగా పంపిణీ చేయాలని తెలిపింది. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మాత్రమే డ్రై డేస్గా ఉండాలని పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మద్యపానం నిషేధించాలని ప్రజలు కోరుతుంటే ఇక్కడ మాత్రం ఆదాయం పెంచుకోవడానికి వయస్సు తగ్గించాలని సూచించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే యువకుల భవిష్యత్తు నాశనం అవుతుందంటున్నారు.