ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానులుండాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఏపీలో రాజధాని మార్పు అంశంపై గవర్నర్ కార్యాలయాన్ని పీఎంఓ ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపిన రాజధాని మార్పు బిల్లుతో పాటు, సీ.ఆర్.డి.ఏ బిల్లుల గురించి వివరాలు కోరినట్లు సమాచారం. రాజధాని ఏర్పాటు చేయడం కేంద్ర పరిధిలోని అంశమని, రాజధాని మార్పు వల్ల నష్టాలు కలుగతాయంటూ హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి చెబుతున్నారు.
ఈ మేరకు ఈయన ప్రధానితో పాటు రాష్ట్రపతి, హోంమంత్రికి కూడా లేఖలు పంపించారు. చట్ట ప్రకారం రాజధాని మార్పు సాధ్యం కాదని లేఖలో వివరించినట్లు చెప్పారు. కాగా నేడు ఇదే అంశాలకు సంబంధించి పీఎంఓ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. పీఎంఓ ఆరా తీసిన అంశంపై ఇంకా పూర్తి స్థాయి వివరాలు బయటకు రాలేదు.