ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వామపక్షాలు మండిపడ్డాయి. ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం గోదావరిలో ముంచేస్తోందన్నారు నేతలు.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు మళ్లీ పంట వేసుకునేందుకు ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టారే తప్ప ప్రాజెక్టు నిర్వాసితుల మీద దృష్టి పెట్టలేదన్నారు. నిర్వాసితులకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
ఇక వేల టీఎంసీలు సముద్రంలోకి వృథాగాపోతున్నాయన్నారు. ఈ సమయంలో ప్రాజెక్టులు కట్టుకొని ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేచీలు పెట్టుకొని అపెక్స్ కౌన్సిల్కు వెళుతున్నాయన్నారు. ఇక అన్ని విషయాల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సహకరించుకుంటున్నారన్న ఆయన.. ప్రజల సమస్య వచ్చినప్పుడు మాత్రం తగాదా పడినట్లు నటిస్తున్నారన్నారు. ఇది సరైంది కాదన్నారు. ఇక వరదలతో పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలన్నారు.
కరోనా విజృంభణ, వరదలు సంభవిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని కోరారు.