ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పర్యాటక రంగంపై కూడా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే విజయవాడలో పదేళ్ల క్రితం మూతపడిన బాపు మ్యూజియాన్ని ఆయన మళ్లీ అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అయితే ఈ మ్యూజియానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం నాటి 1500 అరుదైన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. పురాతన వస్తువుల వివరాలను తెలుసుకునేందుకు పర్యాటకుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఓ కొత్త యాప్ను తీసుకొచ్చి ఫోన్లోనే వస్తువుల వివరాలు తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. బాపు మ్యూజియం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి చిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మన ఫోన్లో మాటల ద్వారా వినేలా అప్లికేషన్ను తయారు చేశారు.
ఈనెల 2వ తేదీన గాంధీ జయంతి నుంచి ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. మ్యూజియంలో జైన, బుద్ద, హిందూ విగ్రహాలు, రాజుల కాలంలో వాడిన కత్తులు, ఆదిమానవుడి కాలం నాటి వస్తువులు, వంట సామాగ్రి మొత్తం అందుబాటులో ఉన్నాయి. చరిత్రను మరిచిపోతున్న నేటి కాలంలో ఇలాంటి మ్యూజియాలు ఏర్పాటు చేయడం వల్ల వెలకట్టలేని జ్ఞానాన్ని భావితరాలకు అందించినట్లు అవుతుంది. సీఎం ఈ చర్యలు చేపట్టడం వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.