మగాడు మాస్క్ ధరిస్తేనే వీరుడి లక్షణం అన్నాడు. చిరునవ్వు మొహానికి ఎంతో అందమన్నాడు. ఆ చిరునవ్వు కలకాలం ఉండాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాలన్నాడు. ఇప్పుడు మరో కొత్త లుక్తో కనిపిస్తున్నాడు. ఎవరనుకుంటున్నారా.. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన శైలిలో ప్రచారం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరెలా ప్రచారాలు చేసినా మన సినీనటులు చేసే ప్రచారాలు మాత్రం ప్రత్యేకం. అదీకాక ఆ ప్రచారాల్లో మెగాస్టారే స్వయంగా రంగంలోకి దిగితే ఇక ఆ ప్రచారానికి కొత్త లుక్ వచ్చేస్తుంది.
రెండు తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించి జాగ్రత్తలు తెలుపడంలో మెగాస్టార్ ముందునుంచీ ముందువరుసలోనే ఉన్నారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో తన సందేశాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై తప్పకుండా ఉందని చెబుతున్నారు.
మెగాస్టార్ లాంటి వ్యక్తే స్వయంగా కోవిడ్ 19 పై జాగ్రత్తలు చెప్పడంలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చైతన్యవంతులయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు మెగాస్టార్ కొత్త లుక్తో కనిపిస్తున్నాడు. మీసాలు, గడ్డం తీసేసిన లుక్తో ఆయన అందరినీ ఆశ్చర్యపరుచుతున్నారు. ఇటు ఇండస్ట్రీతో పాటు యావత్ తెలుగు ప్రజలు మొత్తం ఇప్పుడు మెగాస్టార్ గురించే మాట్లాడుకుంటున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ కొత్త లుక్ తీవ్ర చర్చనీయాంశమైంది. చిరు కొత్త లుక్ కొత్త సినిమా కోసమా.. లేక లాక్ డౌన్లో ఇలా చేస్తున్నారా అంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
సత్యదేవ్ హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన చిరంజీవి.. ఆ సినిమా నచ్చడంతో దర్శకుడు గోపి గణేష్ను తన ఇంటికి పిలిపించుకొని అభిమానించారు. ఈ సందర్బంగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మీసం తీసేయడంతో కారణం తెలియక అభిమానలంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించే చిరు.. ఈ కొత్త గెటప్తో కూడా ఏదో ఒక సందేశం ఇవ్వనున్నారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.