సదావర్తి భూముల ఇష్యూలో ఇప్పటికి తిన్న ఎదురుదెబ్బలు చాలవన్నట్లు ఏపీ అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది కోట్ల ఆదాయాన్ని దెబ్బ తీసేలా కదిపిన పావుల్ని.. ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కమ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు తెచ్చిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
సదావర్తి భూముల వ్యవహారంలో కోర్టు తీర్పునకు లోబడి డబ్బులు కడతామని ఆళ్ల స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఎం చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి అయిన లోకేశ్ మాట్లాడుతూ.. సదావర్తి భూములు కొనుగోలు చేసే వారు భూముల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? డబ్బులు ఎలా పెట్టారన్న అంశంపై ఐటీ దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నారన్నారు.
సదావర్తి భూముల విషయంలో తాము దేవాలయ ఆస్తిని కాజేసేందుకు కుట్రలు చేస్తే వెళ్లి అడ్డుకున్నామని.. అలాంటి తమపై కేసులు పెడతారా? అంటూ ఆళ్ల మండిపడ్డారు. ఓట్లకు కోట్ల కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమన్న ఆళ్ల.. ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓటుకు కోట్ల కేసులో దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
దేవాలయ ఆస్తిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. వాటిని అడ్డుకునేలా అధికారపక్ష నేతలు వ్యవహరిస్తున్నారన్న ఆయన.. సదావర్తి భూములకు డబ్బులు కడుతున్న వారిపై విమర్శలు సంధించటం.. బెదిరింపులకు గరి చేయటం ఏమిటని ప్రశ్నించారు. సదావర్తి భూములు సొంతం చేసుకున్న కాపు కార్పొరేషన్ ఛైర్మన్ సంబంధీకులు రూ.22 కోట్లు కట్టారని.. అంత ఓపెన్ గా జరిగితే దానిపై అధికారులతో మళ్లీ దాడులు చేస్తామని ప్రకటించటం కచ్ఛితంగా బెదిరింపులకు పాల్పడినట్లేనని చెప్పారు.
ఓట్లకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు 2 ఎకరాల నుంచి రూ.2లక్షల కోట్లు ఎలా సంపాదించారని ఆళ్ల ప్రశ్నించారు. ఎన్నికల వేళ.. 600లకు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు.
ఓట్లకు నోట్ల కేసులో చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న ఆళ్ల.. వర్థంతి.. జయంతికి తేడా తెలీని నువ్వు నన్ను విమర్శిస్తావా? అంటూ లోకేశ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కుల పిచ్చి.. మతపిచ్చి ఉన్న పార్టీ టీడీపీ అని లోకేశే స్వయంగా చెప్పారని.. చంద్రబాబు కొడుకును తప్పుడు దారిలో మంత్రిని చేశారన్నారు. ఆళ్ల వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.