దేశ రాజకీయాల్లో సంచలన నాయకుల్లో ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న పేరు ఈయనకుంది. తాజాగా ఆయన సొంత పార్టీ వ్యవహారాలపైనే మండిపడ్డారు.
సుబ్రహ్మణ్య స్వామి ఇటీవలె బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా వివాదం మొదలు కొని జేఈఈనీట్ పరీక్షల వరకు ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విభేదిస్తూనే ఉన్నారు. అయితే పలువురు నెటిజన్లు ఆయనపై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి దిగుతున్నారు.
ఈ పరిణామాలన్నింటిపై స్వామి స్పందించారు. తనను కావాలనే కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. బీజేపీ ఐటీ సెల్ లోనే కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ మర్యాదరామన్నలదే కాని రావణాసురుడు, దుశ్శాసనులది కాదన్నారు. సొంత పార్టీ ఐటీ సెల్పైనే సుబ్రహ్మణ్య స్వామి ఘాటుగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి బీజేపీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా వివాదాలు సుబ్రహ్మణ్యస్వామికి కొత్తేమీ కాదు. అయితే ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారిపైనే ఇప్పుడు ఆయన మండిపడుతున్నారు.