ఏపీ రాజకీయాల్లో ఇన్ని రోజులు కాస్త సైలెంట్గా ఉన్న బీజేపీ ఇప్పుడు స్వరం పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే అంశంపై సోము వీర్రాజు మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన నడవడం లేదని.. వ్యాపారం సాగుతోందని ఆయన విమర్శించారు. విశాఖ కేంద్రంగా కొందరు పాగా వేశారన్నారు. రాజధాని పేరు చెప్పుకొని స్థలాల సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ ఈ సెటిల్మెంట్లకు భయపడదన్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, జనసేన పాత్ర ఎలా ఉండబోతోందో ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేది బీజేపీ, జనసేనలే అన్నారు. 2024లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని చెప్పి చాలా రోజులు అయినా అలా ముందుకు సాగడం లేదే అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేశారు. ఇప్పుడు సోము వీర్రాజు మాట్లాడిన మాటలతో ఇరు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మరి నిజంగా ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తాయేమో వేచి చూడాలి.