ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తూనే కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఏ విధంగా పోలీసుల సేవలు పొందవచ్చన్న దానిపై ఆయన కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన ఓ యాప్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా 87 రకాల సేవలను ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ ఏమన్నారంటే..పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని.. వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాని చెప్పారు. పోలీసు సేవలను పబ్లిక్కు మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్లు తెలిపారు.
ఈ యాప్ ద్వారా ఏ సేవలు పొందవచ్చో క్లియర్గా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ర్యాప్తు పురోగతి, అరెస్ట్లు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్వోసీలు, లైసెన్సులు, పాస్పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా ప్రజలు పొందే అవకాశం కల్పించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకుండా యాప్ ద్వారా సమాచారం పొందడం చాలా ఉపయోగ పడుతుందని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సేవల్లో కూడా ఈ తరహాలోనే మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.